నేటి తెలుగు పత్రిక,Mar 04, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కీలక పథకాలను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ వేదికగా ఈ పథకాలను ప్రారంభించనున్నారు.మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ డ్వాక్రా మహిళల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలకు శ్రీకారం చుట్టింది.
🟣 ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి
డ్వాక్రా సంఘాల సభ్యుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలిచే పథకం.
- రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణ సదుపాయం
- కేవలం పావలా వడ్డీకే రుణం
- అధిక వడ్డీ భారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ భరోసా
🟣 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి
మహిళలు లేదా వారి పిల్లల ఉన్నత విద్య కోసం ప్రత్యేక రుణ సౌకర్యం.
- ప్రొఫెషనల్ కోర్సులు, పై చదువులకు రూ.1 లక్ష వరకు రుణం
- మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఊరట
మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం Indian School of Business, NECC, Amrita Vishwa Vidyapeetham సంస్థలతో సెర్ప్, మెప్మా ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.
🟣 వన్స్టాప్ సెంటర్ల విస్తరణ
మహిళల భద్రత కోసం రాష్ట్రంలో మరో 10 వన్స్టాప్ సెంటర్లు ప్రారంభించనున్నారు. టెక్కలి, రంపచోడవరం, తిరువూరు, తణుకు, తుళ్లూరు, మాచర్ల, మార్కాపురం, కుప్పం, మదనపల్లె, ఆదోని ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. కేంద్రం అందించిన రూ.6 కోట్లతో శాశ్వత భవనాలు నిర్మించనున్నారు.
🟣 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ – డిజిటల్ యాప్
రాష్ట్రంలోని 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వివరాలు, వసతి సదుపాయాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ను సీఎం ఆవిష్కరించనున్నారు. భవిష్యత్తులో మరో 30 హాస్టల్స్ నిర్మాణం చేపట్టనున్నారు.
🟣 ఉపాధి – శిక్షణ అవకాశాలు
- రంపచోడవరంలో రూ.65 లక్షలతో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్
- చిత్తూరులో రూ.70 లక్షలతో మునగ ప్రాసెసింగ్ ప్లాంట్
- విజయవాడ, విశాఖలో ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు
- మహిళల ఆధ్వర్యంలో మరో 5 తృప్తి క్యాంటీన్లు
మొత్తంగా మహిళల ఆర్థిక, సామాజిక, విద్యా, భద్రత అంశాలపై ఏపీ ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించనున్న ఈ పథకాలు రాష్ట్ర మహిళలకు కొండంత అండగా నిలవనున్నాయి.
