అమరావతి, నేటి తెలుగు పత్రిక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రభావం రాష్ట్రంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది.
ప్రకాశం జిల్లా పోలీసులు చేసిన అధ్యయన నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు.మంగళవారం అమరావతిలో జరిగిన వర్చువల్ సమీక్షలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఈ వివరాలను సీఎంకు వివరించారు.స్త్రీ శక్తి పథకం అమలుకు ముందు మరియు తర్వాత పరిస్థితులను పోల్చి చూసినప్పుడు ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య సుమారు 10 శాతం మేర తగ్గినట్టు నివేదికలో వెల్లడైంది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహా అధ్యయనం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల రవాణా విధానంలో మార్పులు వచ్చి రోడ్డు భద్రతపై కూడా సానుకూల ప్రభావం చూపుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
