అమరావతి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాన్ని సాంకేతికత, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు టీసీఎస్, ఆర్సెల్లార్ మిట్టల్, ఎన్టీపీసీ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చామని, ఈ రంగంలో రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో 3.4 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య రంగంలో యూనివర్సల్ వైద్య విధానం అమలు చేసి ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం, రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అలాగే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ దానిపై లోతైన దర్యాప్తు జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, ఏపీని ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
