అమరావతి, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అమరావతిలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో మొత్తం 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపి మూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు.ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లపై కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నిలిచిపోయిందని మంత్రి తెలిపారు. 2018, 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు సరిగ్గా పాటించలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించడంతో నియామకాలు ఆగిపోయాయని చెప్పారు.ప్రస్తుతం లీగల్ అంశాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, త్వరలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.అలాగే గతంలో యూనివర్సిటీల్లో జరిగిన నియామకాలపై మ్యాన్పవర్ ఆడిట్ నిర్వహిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ విషయంలో కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసేలా పలు సంస్కరణలు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
