నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు భట్టి విక్రమార్కతో గతంలో పాదయాత్రలో పాల్గొన్న ఆదివాసీ మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గత ఎన్నికల ముందు సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నుంచి ఖమ్మం వరకు భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్రలో పలువురు ఆదివాసీ మహిళలు ఆయనకు అండగా నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్, ఉట్నూర్ మండలాలకు చెందిన లక్ష్మీబాయి, రుక్మబాయి, గంగుబాయి, సుమన్బాయి తదితరులు పాదయాత్ర అంతా పాల్గొని తమ సంప్రదాయ పానీయాలతో ఆయనకు సహాయం చేశారు.
ఈ అనుబంధాన్ని మరవని భట్టి విక్రమార్క దంపతులు, తన కుమారుడి వివాహానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. వేడుకకు వచ్చిన ఆ మహిళలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాదు, వారికి వివాహ వేదికపైనే ప్రత్యేక స్థానం కల్పించి గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది.పదవులు వచ్చినా పాత అనుబంధాలను మరువని భట్టి విక్రమార్క కృతజ్ఞత, మానవ సంబంధాల పట్ల గౌరవాన్ని ఈ ఘటన మరోసారి చాటిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
