ముంబై,నేటి తెలుగు పత్రిక: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు నేడు సెమీఫైనల్లో తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ కీలక పోరుకు వేదికగా నిలుస్తోంది. రెండు జట్లు తమ మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్పై కన్నేశాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో టాస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2016లో భారతదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో మూడు నాకౌట్ మ్యాచ్లలో టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. అదే ట్రెండ్ ఈ ఏడాది టోర్నీలో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుని దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది.వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ రాత్రి మ్యాచ్లలో మంచు ప్రభావం కీలకంగా ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా 2014 టీ20 ప్రపంచకప్ నుంచి నాకౌట్ మ్యాచ్లు ఎక్కువగా రాత్రి సమయంలోనే జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లలో ఎక్కువసార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్లే విజయాన్ని అందుకున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు చాలా అరుదుగా మాత్రమే గెలిచాయి.ఈ నేపథ్యంలో భారత్–ఇంగ్లాండ్ సెమీఫైనల్లో టాస్ ఫలితం మ్యాచ్పై ప్రభావం చూపుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రెండు జట్లు కూడా బలంగా ఉండటంతో ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.
