నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పెంచేందుకు కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి పడిపోయిందని, ఇది కనీసం 2.1 శాతానికి చేరితేనే భవిష్యత్తులో అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 6.7 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని, ఇది సరిపోదని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనిన కుటుంబాలకు డెలివరీ సమయంలో రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే రెండో బిడ్డ పుట్టినప్పుడు తండ్రికి ఒక నెల సెలవు, మూడో బిడ్డ పుట్టినప్పుడు రెండు నెలల సెలవు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఇది అంతా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రభుత్వం వెల్లడించింది. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకే పరిమితమవ్వాలని చెప్పిన ప్రభుత్వాలే ఇప్పుడు జనాభా పెంపు అవసరమని చెబుతున్నాయి. “ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు” అనే కొత్త నినాదంతో ఈ పాలసీని ముందుకు తీసుకెళ్తోంది.అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సమర్థిస్తుండగా, మరికొందరు ప్రభుత్వ ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా జనాభా పెంపు అవసరమని ఇటీవల మోహన్ భగవత్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
