Mar 06, 2026,నేటి తెలుగు పత్రిక: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోగ్య రంగంలో చేపడుతున్న మార్పులను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించిన KDSG సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఎంపీ మహేష్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం సీఎం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య సేవల నాణ్యతపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం యోగి క్రికెట్ ఉదాహరణతో వైద్యుల పనితీరును వివరించారు. “కపిల్ దేవ్ మైదానంలోకి దిగితే పాకిస్థాన్ జట్టు సగం ఓడిపోయినట్టే భావించేది. అలాగే వైద్యులు ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో రోగులను చికిత్స చేస్తే వారి అనారోగ్యం సగం తగ్గినట్టే” అని వ్యాఖ్యానించారు. మందులతో పాటు విశ్వాసం, సానుకూలత కూడా రోగుల కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా సీఎం వివరించారు. 2017 వరకు యూపీలో కేవలం 17 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా “ఒక జిల్లా – ఒక మెడికల్ కాలేజీ” విధానంతో ఇప్పుడు వాటి సంఖ్య 81కు పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆరోగ్య పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
