హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్కు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైంది. దాదాపు రూ.345 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మైలార్ దేవ్పల్లి – కాటేదాన్ జంక్షన్ – శంషాబాద్ ప్రాంతాల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇరువైపులా రాకపోకలు సాగేందుకు బైడైరెక్షన్గా ఆరు లైన్లతో దీనిని రూపొందించనున్నారు.ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అలాగే నేషనల్ హైవే ఉపయోగించే వాహనదారులకు కూడా ఇది ఉపయోగపడనుంది.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రెండో దశలో మెట్రో విస్తరణను కూడా ప్రణాళికలో పెట్టింది. ఈ విస్తరణలో భాగంగా నగరం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ నిర్మించే ప్రతిపాదన ఉంది. మెట్రోతో పాటు కొత్త ఫ్లైఓవర్ రావడం వల్ల భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటి వల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
