అమరావతి, నేటి తెలుగు పత్రిక: పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సుమారు రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వం ధైర్యాన్ని చూపుతోందని చెప్పారు.సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించడం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు దూరదృష్టిని చూపిస్తోందని కొనియాడారు.
అలాగే గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వల్ల డిస్కంలకు రూ.12,250 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం మీద విద్యుత్ సంస్థలు రూ.1.29 లక్షల కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు.ఇక వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.9 లక్షల కోట్ల అప్పులు మోపి వెళ్లిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాగే రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లారని, అందులో రూ.25 వేల కోట్లను ఇప్పటికే చెల్లించామని తెలిపారు. జల జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలకు గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో వేల కోట్ల నిధులు వినియోగం కాకుండా పోయాయని ఆయన విమర్శించారు.
