హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ కింద నిలిచిపోయిన సర్వీస్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు లేఖ రాశారు. భూసేకరణలో ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం NH-163 పై సుమారు రూ.265 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించింది. 2025 మే 5న ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించినప్పటికీ, కింద ఉండాల్సిన సర్వీస్ రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు2018లోనే ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ, కొన్ని అడ్డంకుల కారణంగా భూసేకరణ పూర్తి కాలేదని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.54 కోట్ల పరిహారం చెల్లించినప్పటికీ, మధ్యవర్తుల వల్ల పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటికీ సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం స్వయంగా చొరవ తీసుకుని GHMC, రోడ్లు-భవనాల శాఖ అధికారులను ఆదేశించాలని కిషన్ రెడ్డి లేఖలో కోరారు.అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయించిందని, రాష్ట్రంలోని 33 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించామని ఆయన గుర్తు చేశారు.
