అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఎన్.చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజులుగా జరిగిన శాసనసభ సమావేశాల్లో ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చర్చలు జరిగాయని తెలిపారు. భావితరాల భవిష్యత్తును నిర్ణయించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు.
ప్రతిపక్ష పార్టీ సభకు హాజరు కాకపోయినా ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలు కొనసాగించిందని సీఎం పేర్కొన్నారు. విభజనతో పాటు గత పాలన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసే బాధ్యత తీసుకున్నామని చెప్పారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోదీ సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు చేస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో తమ కూటమి నిలబెట్టిన అభ్యర్థుల్లో 94 శాతం మంది గెలవడం ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని వెల్లడించారు. గత 20 నెలల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. “సూపర్ సిక్స్” హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టామని పేర్కొన్నారు. గత పాలనలో అనేక వ్యవస్థలు దెబ్బతిన్నాయని, 92 కేంద్ర ప్రాయోజిత పథకాలలో 85 దాదాపు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ఉదాహరణకు జల్ జీవన్ మిషన్ కింద రూ.85 వేల కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ.25 వేల కోట్లకు మాత్రమే ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈ పథకాన్ని గత ప్రభుత్వం మార్చి ఐదేళ్లలో కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి పొడిగింపు కోరామని, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
