మార్చి 6(నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై టీం ఇండియా అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడిలో ఎలా రాణించాలో టీం ఇండియాను చూసి ఇతర జట్లు నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ను అఫ్రిదీ ప్రశంసించారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా కీలక పరుగులు సాధించింది. సంజూ శాంసన్ అర్ధసెంచరీతో రాణించగా ఇతర బ్యాటర్లు కూడా జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడినా విజయం భారత్దే అయింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్య అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు.ఈ సందర్భంగా స్పందించిన అఫ్రిదీ.. బుమ్రా లాంటి బౌలర్ తమ జట్టులో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. ఒత్తిడిలో కూడా పరుగులను కట్టడి చేస్తూ బుమ్రా చూపించిన బౌలింగ్ అద్భుతమని కొనియాడారు. తన అల్లుడు షాహీన్ అఫ్రీదీ కూడా ఇలాంటి స్పెల్ వేసి ఉంటే పాకిస్తాన్ జట్టు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని అభిప్రాయపడ్డారు.అయితే మరోవైపు ఫైనల్ మ్యాచ్పై కూడా అఫ్రిదీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీం ఇండియాకంటే న్యూజిలాండ్ బలమైన జట్టు అని, ఫైనల్లో భారత్కు గట్టి పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా వరుస విజయాలతో ఫైనల్కు చేరిన టీం ఇండియా ట్రోఫీ కోసం పోరాటానికి సిద్ధమవుతోంది.
