కృష్ణాజిల్లా, మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వై. ఎస్. షర్మిల కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న MGNREGA పరిరక్షణ యాత్రలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలోని కవతవరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని షర్మిల కోరారు.ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం బలహీనపరిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం ప్రకారం గ్రామసభలే పనులను నిర్ణయించేవని, కానీ కొత్త విధానంలో కేంద్రం నోటిఫికేషన్ ద్వారా పనులు నిర్ణయించడం అన్యాయమని అన్నారు.
అదేవిధంగా కొత్త మార్పులతో ఉపాధి హామీ చట్టం కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసే విధంగా చట్టాన్ని మార్చారని, దీని ద్వారా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు.రాష్ట్రాలపై కూడా భారీ భారం పడుతోందని షర్మిల తెలిపారు. గతంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే సరిపోయేదని, ఇప్పుడు రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాల్సి వస్తుందని చెప్పారు. అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇది పెద్ద భారమని అన్నారు.అలాగే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేసి, కాంగ్రెస్ తీసుకొచ్చిన పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని షర్మిల డిమాండ్ చేశారు.
