మార్చి 06 (నేటి తెలుగు పత్రిక ): లాస్ వేగాస్లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఈవెంట్ Consumer Electronics Show 2026లో ఒక ఆసక్తికరమైన ఆవిష్కరణ సందర్శకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పాటలు వినాలంటే హెడ్ఫోన్స్ లేదా స్పీకర్లు అవసరం. కానీ ఇప్పుడు ఒక లాలీపాప్ను నోట్లో పెట్టుకుంటే చాలు… మీకు మాత్రమే వినిపించేలా సంగీతం వినిపించే కొత్త టెక్నాలజీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ ‘మ్యూజికల్ లాలీపాప్’ ప్రత్యేకత ఏమిటంటే ఇది బోన్ కండక్షన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. లాలీపాప్ను నోట్లో పెట్టుకున్నప్పుడు అది పళ్ళ ద్వారా దవడ ఎముకలకు చిన్న చిన్న కంపనాలను పంపిస్తుంది. ఆ కంపనాలు నేరుగా చెవిలోని లోపలి భాగానికి చేరడంతో వేరే ఎవరికీ వినిపించకుండా కేవలం లాలీపాప్ను ఉపయోగిస్తున్న వ్యక్తికే సంగీతం వినిపిస్తుంది. లాలీపాప్ను కొరికినప్పుడు లేదా నోటిలో అటు ఇటు కదిలించినప్పుడు సంగీతం తీవ్రత కూడా మారుతుందని చెబుతున్నారు.
ఈ పరికరం బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోన్కు కనెక్ట్ అవుతుంది. వినియోగదారులు తమకు నచ్చిన పాటలను సెలెక్ట్ చేసుకుని వినగలరు. అంతేకాదు ఇది కేవలం టెక్నాలజీ గాడ్జెట్ మాత్రమే కాకుండా స్ట్రాబెర్రీ, మింట్ వంటి రుచికరమైన ఫ్లేవర్లలో కూడా అందుబాటులో ఉంది.అయితే టెక్ నిపుణుల మాట ప్రకారం ఇది పూర్తిగా కొత్త ఆవిష్కరణ కాదు. 1990లలో “టూత్ ట్యూన్స్” అనే పరికరాల ద్వారా కూడా ఇలాంటి బోన్ కండక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. కానీ ఇప్పుడు వచ్చిన మ్యూజికల్ లాలీపాప్ మాత్రం ఆధునిక డిజైన్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో మరింత ఆకర్షణీయంగా మారింది.ప్రస్తుతం CESలోకి వచ్చిన సందర్శకులు ఈ లాలీపాప్ను ఉపయోగిస్తూ ఫోటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ మ్యూజికల్ లాలీపాప్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ భవిష్యత్తులో ఆహారం, వినోదం కలిసిపోయే కొత్త తరహా పరికరాలు మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
