హైదరాబాద్:మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలే ప్రధాన కారణమని అన్నారు. ప్రజల అండదండలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మాటలతోనో, డబ్బుతోనో అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారని సీఎం తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగించామని అన్నారు. ఈ పోరాటంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.ప్రజల సమస్యల కోసం ఉద్యమించిన వేలాది మంది కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
