ఉండవల్లి,mar 07,నేటి తెలుగు పత్రిక: అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పలు పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ను కోరారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఉండవల్లిలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు.సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దగ్గుపాటి వివరించారు. అనంతపురం నగరంలో వర్షాకాలంలో ముంపు సమస్య ఎక్కువగా ఎదురవుతోందని తెలిపారు. ముఖ్యంగా నడిమివంక, మరువవంక వాగులు పొంగిపొర్లడంతో అనేక కాలనీలు నీటమునుగుతున్నాయని చెప్పారు. ఈ సమస్యను నివారించేందుకు రెండు వాగుల వద్ద ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి జల వనరుల శాఖ సుమారు రూ.79.46 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు వివరించారు.
అలాగే నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గతంలో రూ.25 కోట్ల అంచనాతో పనులు ప్రతిపాదించగా, అందులో కేవలం రూ.6.16 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన నిధులతో రోడ్లు, రక్షిత తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ప్రజా టాయిలెట్లు వంటి పనులు చేపట్టేందుకు రూ.18.84 కోట్లు మంజూరు చేయాలని కోరారు.ఇక నగర శివారులోని శిల్పారామం అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక నిధులు అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్కులో మరమ్మతులు, పరికరాల భర్తీ, అదనపు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.9.95 కోట్లు కేటాయించాలని సీఎంకు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా కూడేరు మండలం ముద్దలాపురంలో ఉన్న 16 ఎకరాల భూమిలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.16 కోట్లు కేటాయించాలని కోరారు.ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అవసరమైన నిధుల కేటాయింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు.
