అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80ఏళ్ల అథ్లెట్ రామసుబ్బమ్మ విజయగాథపై రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. చిన్నవయసు క్రీడాకారులతో పోటీ పడుతూ పతకాలు సాధిస్తున్న రామసుబ్బమ్మకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంత్రి లోకేష్, “తీనేజ్ పిల్లలతో పరుగుపందెంలో పోటీ పడుతున్న ఓల్డేజ్ గ్రాండ్మాకు శిరసు వంచి నమస్కారం. నేటితరానికి మీనాటి తరం ఎప్పుడూ స్ఫూర్తి” అని పేర్కొన్నారు.
రామసుబ్బమ్మ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఆమె 32 గోల్డ్ మెడల్స్, 14 సిల్వర్ మెడల్స్ సాధించారని తెలిపారు. చిన్ననాటి నుంచి ఆటలపై ఆసక్తి ఉన్నప్పటికీ పేదరికం కారణంగా క్రీడలు కొనసాగించలేకపోయారని అన్నారు. తరువాత కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ పిల్లలను చదివించి స్థిరపరిచిన తర్వాత మళ్లీ తన కలను నెరవేర్చుకునేందుకు పరుగును ప్రారంభించారని చెప్పారు.80ఏళ్ల వయస్సులోనూ సంకల్పంతో క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించడం గొప్ప విషయమని మంత్రి లోకేష్ అన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలనుకుంటున్న రామసుబ్బమ్మకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.“ఏ సాయం కావాలన్నా అందిస్తాను. రన్ గ్రాండ్మా… రన్” అంటూ మంత్రి లోకేష్ తన సందేశాన్ని ముగించారు.
