Mar 07,నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించే చర్యలపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నియంత్రించేలా రోడ్మ్యాప్ రూపొందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం ప్రశంసనీయం అని మనోజ్ పేర్కొన్నారు. ఇదే తరహాలో 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించాలని ప్రతిపాదించిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వానికీ ఆయన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ యువత ఆలోచనా దృక్పథాన్ని రక్షించేందుకు ఇది సరైన సమయంలో తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయమని అన్నారు. ఒక తండ్రిగా పిల్లల ఎదుగుదలలో సోషల్ మీడియా ప్రభావాన్ని తాను దగ్గరగా గమనించానని చెప్పారు. తప్పుడు సమాచారం, వ్యసనపరమైన అలవాట్లు చిన్న వయసులోనే పిల్లలపై ప్రభావం చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలు ఎదుగుతున్న కీలక దశలో వారిని సంరక్షించడం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొన్న మనోజ్, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
