Mar 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నిందితులకు సంబంధించిన భారీ మొత్తంలో ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో రూ.441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా సుమారు రూ.1048 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ తన ప్రకటనలో వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA)–2002 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.ఇక లిక్కర్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీలో విచారించారు. విచారణలో వందకు పైగా ప్రశ్నలు అడిగి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం ముడుపుల ద్వారా చివరకు లాభం పొందింది ఎవరు అనే అంశంపై సిట్ అధికారులు ఆరా తీశారు. అనంతరం ఆయనను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.
దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ మద్యం కుంభకోణం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.4 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్బ్యాక్లు తీసుకున్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కమిషన్ ఇవ్వని కంపెనీలకు సరఫరా ఆర్డర్లు నిలిపివేసినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు ఈ కేసులో ఏ52గా ఉన్న ప్రణయ్ ప్రకాష్ను ఇటీవల నేపాల్లోని సోనౌలీ చెక్పోస్ట్ వద్ద సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడకు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు మార్చి 13 వరకు ఆయనను జ్యూడిషియల్ రిమాండ్కు తరలించారు.ప్రణయ్ ప్రకాష్ అరెస్టుతో ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 17కు చేరింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
