మార్చి 7,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు మూడు కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, అలాగే యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ఫోన్ల పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు.ఈ పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం
రాష్ట్రంలోని ఆడపిల్లల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
- డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలలు సభ్యులుగా ఉన్నవారు అర్హులు.
- ఒక కుటుంబంలో రెండు బాలికల వరకు ఈ పథకం వర్తిస్తుంది.
- రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రుణం అందిస్తారు.
- కేవలం పావలా వడ్డీకే (0.25%) రుణం లభిస్తుంది.
- ఈ మొత్తాన్ని 48 నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించే అవకాశం ఉంది.
- దరఖాస్తు చేసిన తర్వాత 48 గంటల్లోనే స్త్రీనిధి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు
- ఆదాయ ధృవీకరణ పత్రం లేదా డొమిసైల్ సర్టిఫికెట్
- స్కూల్ లేదా కాలేజ్ అడ్మిషన్ లెటర్
- ఫీజు రిసిప్ట్
ఎలా అప్లై చేయాలి?
స్థానిక డ్వాక్రా సంఘం, సెర్ప్ యానిమేటర్ లేదా వెలుగు కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం
డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
- పెళ్లిళ్ల కోసం రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం అందిస్తుంది ప్రభుత్వం.
- కేవలం 25 పైసల వడ్డీకే ఈ రుణం లభిస్తుంది.
యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ఫోన్లు
డ్వాక్రా సంఘాల నిర్వహణ, బుక్ కీపింగ్, రికార్డుల నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27,500 మహిళా సంఘాలకు చెందిన యానిమేటర్లకు రూ.15 వేల విలువైన స్మార్ట్ఫోన్లు అందించనున్నారు.
- అదనంగా 5,000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు కూడా ఫోన్లు ఇస్తారు.
- అలాగే 600 మంది APMలకు ల్యాప్టాప్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహిళల ఆర్థిక స్వావలంబన, విద్యాభివృద్ధి, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలను ప్రభుత్వం తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
