తిరుపతి,mar 07, నేటి తెలుగు పత్రిక: నీతి, నిజాయితీ విషయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంగారం లాంటివారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి లోకేష్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విద్యార్థినుల నిజాయితీని అభినందించారు.తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్లో చదువుతున్న విద్యార్థినులు గురువారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత మన్నవరం బస్సుకోసం వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద వేచి ఉండగా రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. కొత్తపల్లిగుంటకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతికతో పాటు 6వ తరగతి విద్యార్థిని పద్మశ్రీ, 7వ తరగతి విద్యార్థిని హేమలత ఆ పర్సును తీసి చూడగా అందులో బంగారు నగలు, నగదు ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఎలాంటి ఆలోచన లేకుండా ఆ విద్యార్థినులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పర్సును అక్కడి ఎస్ఐ స్వరూపాకు అప్పగించారు. అనంతరం వారు తిరిగి బస్టాప్కు వెళ్లగా, పర్సు కోసం వెతుకుతున్న ఓ మహిళ వారిని అడగడంతో, తమకు దొరికిందని మరియు పోలీస్ స్టేషన్లో ఇచ్చామని తెలిపారు. తర్వాత ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు.ఆ మహిళకే పర్సు చెందినదని నిర్ధారించిన పోలీసులు అందులోని నగలు, నగదును ఆమెకు తిరిగి అందజేశారు.ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్టు చేస్తూ, “చిన్న వయస్సులో మీ నిజాయితీ ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ. మీలాంటి విద్యార్థినులు ఉన్నందుకు గర్వంగా ఉంది. మీ నిజాయితీతో విద్యాశాఖ గౌరవం మరింత పెరిగింది” అని పేర్కొన్నారు. విద్యార్థినుల నీతి, నిజాయితీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
