అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల వివరాలు, వాటిలో పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన భూవిస్తీర్ణం, ఇంకా ఖాళీగా ఉన్న భూవిస్తీర్ణంపై సభ్యులు ప్రశ్నించగా మంత్రి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలోని భారత ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సమన్వయంతో ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.
ఇందులో భాగంగా విశాఖపట్నంలో ACIP అనే సంస్థకు భూములు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, పరిశ్రమలకు ఎదురయ్యే చిన్న సమస్యలైనా యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేలా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎలక్ట్రానిక్ పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
