ఏలూరు,mar 07, నేటి తెలుగు పత్రిక: ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పరిరక్షణ యాత్ర నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటించిన జనాభా విధానంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పటికే ఉన్న పిల్లలకే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న బోడి 25 వేల రూపాయల కోసం మూడో బిడ్డను కనాలా?” అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఇచ్చిన హామీలకే దిక్కులేదని ఆమె విమర్శించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని సుమారు 12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవని, ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి లేదని పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ పథకానికి రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.6 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపిందని విమర్శించారు.
ఉపాధి హామీ పథకంపై విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేదలకు భరోసా ఇచ్చిన పథకమని షర్మిలా అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ పథకం పండుగలా నడిచిందని చెప్పారు.
కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచిందని ఆరోపించారు. ఉపాధి హామీ ప్రకారం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ పాలనలో 52 రోజులు కూడా పని ఇవ్వలేదని విమర్శించారు.మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన VB G–RAM G చట్టం గ్రామాలకు ఉన్న అధికారాలను తొలగించే చట్టమని, ఉపాధి పనులను కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టేలా మారుస్తోందని అన్నారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రంపై సుమారు రూ.5 వేల కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద భారం మోసే పరిస్థితి లేదని తెలిపారు. ఈ చట్టానికి మద్దతు ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పు అని విమర్శించారు. అలాగే మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో జగన్ విఫలమయ్యారని కూడా అన్నారు.రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వై. ఎస్. షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
