కరీంనగర్, మార్చి 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాలతో ‘న్యాయ చైతన్య’ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు మరియు పానెల్ అడ్వకేట్ లు మాట్లాడుతూ ఆడపిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదని తమను తాము రక్షించుకునే చట్టబలం కూడా ఉండాలని అన్నారు. వేధింపులను భరించడం అంటే నేరాన్ని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠినమైన సెక్షన్లు నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి పేరుతో మోసం చేసే సెక్షన్ 69, వేధించే సెక్షన్ 78 వంటివి మహిళల భద్రతకు కవచంగా ఉన్నాయని వివరించారు. ఏ పోలీస్ స్టేషన్లోనైనా కేసు నమోదు చేసే ‘జీరో ఎఫ్.ఐ.ఆర్’ హక్కు గురించి బాధితులకు అందే ఆర్థిక పరిహారం, ఉచిత న్యాయవాది సదుపాయం గురించి తెలియపరిచారు. విద్యార్థినుల నుంచి విశేష స్పందన లభించింది. అపూర్వ కాలేజీ విద్యార్థినులందరూ ముక్తకంఠంతో మహిళా చైతన్య ప్రతిజ్ఞ చేస్తూ అన్యాయంపై గళమెత్తుతామని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు, పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్ర ప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్ , పానెల్ అడ్వకేట్ లు ఎస్విఆర్ కృష్ణ, బొజ్జ శ్రీలక్ష్మి, బాశెట్టి సమతా రాణి, నాజియా కుతీజా, తిరుమణి అశ్విని, బలుసుల శాంతి కుమార్ లతో పాటు కళాశాల చైర్మన్ పి. వేణు, ప్రిన్సిపాల్ కే. మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ రాధికా,అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం మహిళా పానెల్ అడ్వకేట్ లకు, కళాశాలలోని 5 మంది ఉత్తమ విద్యార్థినులకు, ముగ్గురు మహిళా అధ్యాపకులకు, ఇద్దరూ మహిళ స్వీపర్లకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా శాలువాలతో సత్కరించి అభినందనలు.
