- 58 అడుగుల ఎత్తులో అమరజీవి కాంస్య విగ్రహం
- సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరణ
- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
- అమరజీవి స్మృతి వనం పరిశీలించిన మంత్రి సవిత
తుళ్లూరు/అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగ ఫలితం భావితరాలకు తెలియజేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న ఆయన విగ్రహ పనులను శనివారం మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ పేరుతో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మృతి వనంలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమరజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తోందన్నారు. అమరజీవి 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తైన ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే స్మృతి వనం లక్ష్యమన్నారు. ఈ నెల 16న అమరజీవి 125వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహావిష్కరణను చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు తరలిరానున్నారన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజును రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. వాసవీ మాత పేరుతో ఆమె జన్మంచిన పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మార్చామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు ఆమె, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పొట్టి శ్రీరాముల విగ్రహా ఏర్పాటు పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



