అమరావతి,నేటి తెలుగు పత్రిక,mar 08: పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు.ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోటోకాల్ కల్పించలేదనే వార్తలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. తన పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందన్నారు.ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రపతి పదవిని అవమానించేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవం, మర్యాదలతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సమిష్టి విధి అని ఆయన అన్నారు.
