నేటి తెలుగు పత్రిక,mar 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు గుజ్జుల ఈశ్వరయ్య. మహిళా దినోత్సవం కేవలం ఉత్సవాల రోజు కాదని, మహిళల సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనం కోసం ప్రపంచ కార్మిక మహిళలు సాగించిన చారిత్రాత్మక పోరాటాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు మహిళల సమానత్వం, ఆర్థిక స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ మహిళా విముక్తి ఉద్యమాలకు దిశానిర్దేశం చేశాయని తెలిపారు. మహిళా దినోత్సవ పోరాట స్ఫూర్తిని పాలక వర్గాలు వక్రీకరిస్తూ రాజకీయ అవసరాల కోసం ఉత్సవాలు, ఆటపాటలకే పరిమితం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.మహిళలను సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉంచే విధానాలు అమలు చేస్తూ వారి అభ్యుదయ ఆలోచనలను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల అసలు సమస్యలైన భద్రత, ఉపాధి, సమాన వేతనం, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ప్రభుత్వాలకు స్పష్టమైన కార్యాచరణ లేదన్నారు.రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు, అత్యాచారాలు పెరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మహిళల భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. అధికార ప్రజాప్రతినిధులే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగమైన ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన మాట తప్పిందని ఆయన విమర్శించారు.
మహిళల స్వాభిమానానికి, ఆర్థిక స్వావలంబనకు, సమాన హక్కులకు కేవలం హామీలు కాకుండా స్పష్టమైన చట్టాలు, కార్యాచరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కుల కోసం సాగిన చారిత్రాత్మక పోరాటాల స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ సమానత్వం ఆధారంగా నిర్మితమయ్యే సమాజం కోసం ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మహిళల గౌరవం, సమానత్వం, విముక్తి కోసం సాగుతున్న ప్రతి ఉద్యమానికి Communist Party of India అండగా నిలుస్తుందని Gujjula Eswarayya తెలిపారు.
