నేటి తెలుగు పత్రిక,mar 09: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం నుంచి ప్రారంభమైన సాధికారత ప్రయాణం నేడు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి చేరిందని సీఎం తెలిపారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
“తల్లికి వందనం”, స్త్రీశక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. అలాగే మెగా డీఎస్సీ ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, ఇప్పటివరకు లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేసినట్లు సీఎం తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్రంతో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నిరోధక ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు.మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
