అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఎన్.చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో “స్వయం ఏపీ” బ్రాండ్ లోగోను ఆయన ఆవిష్కరించారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తానే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తానని సీఎం ప్రకటించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను మహిళలే వినియోగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్లాది కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలను సన్మానించారు. అలాగే 6.81 లక్షల మంది మహిళలకు రూ.10,100 కోట్ల సబ్సిడీ రుణాలకు సంబంధించిన మెగా చెక్కును అందజేశారు.
ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మరో ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తారని, అందుకే వారే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు అని ఆయన అన్నారు.
మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
