అమరావతి,mar 09, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ఎన్.చంద్రబాబు నాయుడు సందర్శించి పరిశీలించారు. మహిళలు తయారు చేసిన చేతి నేసిన చీరలు, తోలుబొమ్మలు, గుర్రపుడెక్కతో రూపొందించిన బుట్టలు, మిల్లెట్ ఉత్పత్తులు వంటి వస్తువులను ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడిన సీఎం, ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ శిక్షణతో పులివెందులలో మిల్లెట్ టిఫిన్స్, బిస్కెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్టు ప్రమీల అనే మహిళ సీఎంకు వివరించారు. వినియోగదారుల ఆరోగ్యం, ఉత్పత్తుల నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలని ఆమెకు సీఎం సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వ్యవసాయం ద్వారా పండిస్తున్న చెర్రీ టమాట, స్ట్రాబెర్రీ పంటలకు సంబంధించిన స్టాల్ను కూడా సీఎం పరిశీలించారు. అలాగే పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్న మహిళ ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన శక్తి టీమ్ స్టాల్ను పరిశీలించిన సందర్భంగా శిరీష అనే మహిళ తన ప్రాణాన్ని శక్తి టీం సభ్యులు కాపాడిన ఘటనను వివరించారు. ప్రస్తుతం ఆమె మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగం పొందినట్లు సీఎంకు తెలియజేశారు.
స్టాళ్లను ఏర్పాటు చేసిన మహిళల అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
