Mar 09, నేటి తెలుగు పత్రిక: రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కు లేఖ రాశారు. NTPC లిమిటెడ్ ఆధ్వర్యంలో రామగుండం లో చేపట్టనున్న సెకండ్ ఫేజ్లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మూడు థర్మల్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ చర్యలు చేపట్టిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొదటి దశలో లాగే రెండో దశలో ఉత్పత్తి చేసే విద్యుత్లో 85 శాతం తెలంగాణ రాష్ట్రానికే సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
2026 మార్చి 3న తెలంగాణలో రికార్డు స్థాయిలో 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని, రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరగనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కొత్త ఉత్పత్తి వనరులు అవసరమని ఆయన వివరించారు.అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల విద్యుత్ రంగంపై ఇచ్చిన ప్రెజెంటేషన్లో రాష్ట్రంలో 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారని తెలిపారు. 2047 నాటికి తెలంగాణలో లక్ష మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండొచ్చని కూడా పేర్కొన్నారు.అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయడంలో NTPCకు విస్తృత అనుభవం ఉందని, ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకుంటే రాష్ట్రానికి తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి మరియు ప్రజలకు లాభం చేకూరుతుందని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.
