Mar 09, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ భూములపై అజమాయిషీని కొందరి చేతుల్లో పెట్టేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చట్టం వల్ల భూసంబంధిత వివాదాల్లో అప్పీల్ చేసే అవకాశాలు కూడా లేకుండా చేయాలని ప్రయత్నించారని విమర్శించారు. పాణ్యం నియోజకవర్గంలో గతంలో పట్టాదారు పాస్ పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చానని ఆయన గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని సీఎం తెలిపారు. రైతుల భూహక్కులు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
