నేటి తెలుగు పత్రిక,mar 10: ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పాసు పుస్తకాలను రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందజేస్తామని తెలిపారు.సోమవారం కొత్తబురుజు లో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను కూడా పరిశీలించారు. పండ్లకు కవర్లు తొడగడం వల్ల మంచి ధర వస్తోందని అధికారులు వివరించగా, రైతులకు దీనిపై మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.
అనంతరం సభలో మాట్లాడిన చంద్రబాబు, కొత్త పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల భూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేసినా వెంటనే గుర్తించవచ్చని చెప్పారు. రైతుల భూముల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో భూవివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి భూమి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే గతంలో అమల్లో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించామని పేర్కొన్నారు.
