నేటి తెలుగు పత్రిక,mar 10: ఖమ్మం లో మాజీ ఎమ్మెల్సీ కె. కవిత పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. భూదాన్ బాధితులను పరామర్శించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా అంబేద్కర్ భవన్లో నిరాహార దీక్ష ప్రారంభించారు.బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించబోనని కవిత ప్రకటించారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆమె నిరాహార దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు పలువురు ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులు, బాధితుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. మహిళా పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఖమ్మం ఏసీపీ తెలిపారు.వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని కవిత సోమవారం రాత్రి నుంచి నిరసనలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఖమ్మంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
