మార్చ్10( నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతూ పంచాయతీల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. జనాభా, ఆదాయం, భౌగోళిక ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుని పంచాయతీలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా పలు గ్రామ పంచాయతీలను గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కేటగిరీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, అనంతపురం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, బాపట్ల జిల్లా, చిత్తూరు జిల్లా. జిల్లాల్లోని పంచాయతీలను ఈ కేటగిరీల్లోకి చేర్చింది.
గ్రామాల్లో పట్టణాల తరహా సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా “రూర్బన్ పంచాయతీలు” ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. జనాభా 10 వేలకుపైగా ఉన్న గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్ తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంచాయతీల వర్గీకరణకు సంబంధించిన వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసి, అవసరమైన మార్పులు ఆన్లైన్ డేటాలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
