మంత్రి లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు
నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5 కోట్లు సాయం ప్రకటన
ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక,mar 10: పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించనుంది. ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు.. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. పీ-4 కార్యక్రమంలో భాగంగా మన బడి-మన భవిష్యత్ కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు. మన బడి- మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వవిద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తోంది. దాతల పేర్లు కూడా ఆయా పాఠశాలలకు పెట్టుకునే అవకాశం కల్పించనుంది. త్వరలోనే మన బడి – మన భవిష్యత్తు వెబ్ సైట్ ను ప్రారంభించనుంది.మరోవైపు బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు, కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.5 కోట్ల సాయాన్ని అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ అందించనుంది.

