కోదాడ, మార్చ్ 10: (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన సందర్భంగా కోదాడ 21 వ వార్డు శ్రీమన్నారాయణ కాలనీలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సుడిగాలి పర్యటన చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ, హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఖాళీ ప్లాట్లల్లో వేసిన చెత్తాచెదారం పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. కాళీ ప్లాట్ల వారికి నోటీసులు జారీ చేయాలని, చెత్త వేసిన వారికి పెనాల్టీలు విధించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక శ్రద్ధతో ఎర్రగుంట వాగు దుస్థితిని పలుచోట్ల ఆయన స్వయంగా పరిశీలించారు. వాగు ఆక్రమణల గురించి ప్రశ్నించారు. హుజూర్నగర్ రోడ్ లోని యాపిల్ హాస్పటల్ వద్ద గల శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి ఖానలు పూర్తిగా పూడికతో నిండి ఉండడాన్ని గమనించారు. ఇట్టి విషయమై చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రతి వార్డులో కౌన్సిలర్ల సహకారంతో అధికారులు సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఎర్రగుంట వాగు సమస్యను కలెక్టర్కు సామాజిక కార్యకర్త, బహుజన వేదిక రాష్ట్ర కన్వీనర్ కస్తూరి రాములు వివరించి సమస్య పరిష్కారానికి సైడ్ వాల్స్ నిర్మాణం జరపాలని కోరారు. అంతేకాకుండా వాగుపై అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేయాలని, వేసవిలో వాగు పూడిక తీయించాలన్నారు. గతంలో వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరించారు. కలెక్టర్కు సామాజిక కార్యకర్త కస్తూరి రాములు, వార్డు కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస యాదవ్ వార్డు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్మన్ డి. మల్లీశ్వరి, వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీనివాసరావు, ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ రమాదేవి, అడ్వకేట్ పగడాల రామచంద్రారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డు వీరయ్య , పొట్ట జగన్మోహన్రావు, అత్తలూరి ప్రసాద్, ప్రతాపరెడ్డి, చామర్తి బ్రహ్మం, గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
