నేటి తెలుగు పత్రిక,mar 10: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు Sభారత సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.మంగళవారం జస్టిస్ బి. వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని, త్వరలోనే అదనపు చార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై లోతైన విచారణ కొనసాగుతోందని కోర్టుకు వివరించారు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టై జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు అయింది. ప్రస్తుతం ప్రభాకర్ రావుకు లభించిన బెయిల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
