Mar 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెదవడ్లపూడి లో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.మంత్రి లోకేష్ గ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించారు. అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
దాదాపు 250 క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం కలిగిన ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని సుమారు 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు పంపులను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి ప్రారంభించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ టీడీపీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షుడు పడవల మహేష్, కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియ, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్బాషా తదితరులు పాల్గొన్నారు.
