Breaking News

జీరో హ్యమన్, యానిమల్ లాస్ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఎండ తీవ్రత, వడగాల్పులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
• ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ – 2026’ ఆవిష్కరణ
• మధ్యాహ్నం 12-4 గంటల మధ్య జరిగే పనులను రీషెడ్యూల్ చేసుకోవాలి

రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత

విజయవాడ,mar 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.స్థానిక తాడేపల్లి లోని మంగళవారం ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, లైన్ డిపార్ట్ మెంట్స్, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో ఎండ తీవ్రత, వడగాల్పుల సంసిద్ధతపై రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ… రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రజల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ – 2026’ ను మంత్రి ఆవిష్కరించారు. హీట్ వేవ్ మరణాలు లేకుండా శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ సంస్థ మరియు ఆర్టీజీఎస్ (RTGS) నుండి అందే వడగాల్పుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ, వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ఒక్క ప్రాణం కూడా వడదెబ్బ వల్ల పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి పనులు చేయకుండా పనివేళలను రీ షెడ్యూల్ చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కార్మికులు, వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ బారిన పడే వారి కోసం ఆసుపత్రులలో ప్రత్యేక బెడ్లు, మందులు మరియు అంబులెన్సులను సిద్ధం చేయాలని వైద్య శాఖను ఆదేశించారు.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

బస్టాండ్లు, మార్కెట్లు, కూడళ్లు మరియు పర్యాటక ప్రాంతాల్లో తప్పనిసరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్జీవోలు, కమ్యూనిటీ గ్రూపుల ద్వారా మజ్జిగ, మంచి నీరు పంపిణీ చేయాలని సూచించారు. ఎండల వల్ల పశువులకు ముప్పు కలగకుండా గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్లతో నిరంతరం నింపాలని, పశు గ్రాసం విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే ఎండల దృష్ట్యా గృహ అవసరాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్ డబ్ల్యూ ఎస్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు మండల, గ్రామ స్ఠాయి అధికారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. దేవాలయాలు, టూరిస్ట్ స్పాట్ల వద్ద త్రాగు నీటి సదుపాయం, మెడికల్ క్యాంపులు నిరంతరం ఉండాలని జిల్లా కలెక్టర్లను మంత్రి అనిత ఆదేశించారు.

వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, నీటి కుంటలు వద్ద ఆడుకునే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నందున అటువంటి చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ డిపార్టుమెంటు తప్పని సరిగా హాస్పిటల్స్, హోటళ్లు, ప్రవేటు బిల్డింగ్స్ లో వైరింగ్, ఇతర ఫైర్ సేఫ్టీ వంటివి తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్లు ఎండ తీవ్రత జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అలాగే ఎండ తీవ్రత సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 నెంబర్లు ప్రచారం చేయాలన్నారు.

విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకు అధికారులు తమ తమ ప్రణాళికలతో గత వేసవి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధంగా ఉండాలని కోరారు.సమీక్ష సమావేశంలో ఎస్డీఆర్ఎఫ్ ఐజిపి రాజకుమారి, ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఫైర్ డిపార్టమెంట్ అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందర్, జిల్లాల నుంచి కలెక్టర్లు, డిఆర్వోలు వర్చువల్ గా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *