‘ఆటవిడుపు’ కార్యక్రమంపై విమర్శలు కళాకారుల మనోభావాలకు దెబ్బ
మంగళగిరి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): శాసనసభ వేదికగా నిర్వహించిన ‘ఆటవిడుపు’ కార్యక్రమంపై కొందరు చేస్తున్న విమర్శలు అత్యంత దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. కళాకారుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కళలను రాజకీయాలతో కలపడం సరైంది కాదన్నారు. ఏ రాష్ట్రంలో కళలు అభివృద్ధి చెందుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పారని గుర్తుచేశారు.
మహానుభావులు కళలను ప్రోత్సహించారు
చరిత్రలో కృష్ణదేవరాయ, భోజుడు వంటి మహానుభావులు కళలను ప్రోత్సహించి చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. అలాగే మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు వంటి నేతలు కూడా కళల పట్ల ఆసక్తి చూపినవారేనని పేర్కొన్నారు. అలాంటి కళలను ‘పనికిమాలిన చర్య’గా విమర్శించడం అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.
నాయకులపై విమర్శలు తగవు
ప్రజల కోసం నిరంతరం పని చేసే ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే దానిపై విమర్శలు చేయడం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు.
కళ దైవదత్తం
కళ అనేది దైవదత్తమని, అది ప్రతి ఒక్కరికీ లభించదని గోపాలకృష్ణ అన్నారు. కళాకారులను అవమానించడం తగదని హెచ్చరించారు. కరోనా కాలంలో కళాకారులు ఇబ్బందులు పడినప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు విమర్శలు చేయడం తగదని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కళాకారులకు బకాయిగా ఉన్న రూ.10 కోట్లను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించిందని పేర్కొన్నారు.
విమర్శలు మానుకోవాలని సూచన
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి విమర్శలు చేయాలని ఆయన సూచించారు. కళాకారులను, కళారూపాలను అవమానించడం ఆపాలని హెచ్చరించారు. కళాకారుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే అది సరైన పద్ధతి కాదన్నారు. కళాకారులు సున్నిత మనస్కులైనా తమ గౌరవాన్ని కించపరిస్తే సహించబోమని గుమ్మడి గోపాలకృష్ణ స్పష్టం చేశారు.
