పెనుకొండ/శ్రీసత్యసాయి,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, వాటిపై విమర్శలు చేయడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు అర్హత లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి S. సవిత మండిపడ్డారు. మహిళలను గౌరవించని వ్యక్తి జగన్ అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’, ‘దీపం’ పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించారు. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
మహిళలను అవమానించిన వైసీపీ
జగన్ హయాంలో మహిళలపై అనేక దాష్టీకాలు జరిగాయని మంత్రి సవిత ఆరోపించారు. శాసనసభలో తల్లిలాంటి నారా భువనేశ్వరి ను అవమానించారని గుర్తు చేశారు. సొంత తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయని వ్యక్తి జగన్ అని విమర్శించారు.అలాగే తాడేపల్లి, పులివెందుల ప్రాంతాల్లో మహిళలపై జరిగిన ఘటనలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదేనని అన్నారు.
రాయలసీమ అభివృద్ధి చంద్రబాబు వల్లే
రాయలసీమ అభివృద్ధికి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని మంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ మరియు పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు. ప్రజలు ఇప్పటికే వైసీపీని తిరస్కరించారని, వారి వ్యాఖ్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆమె అన్నారు.
