మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం ప్రకటించారు. విచారణ అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు.తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత గడువు ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లలో ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇవ్వగా, తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులపై కూడా తీర్పు వెలువడింది. దీంతో మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నుంచి ఊరట లభించినట్టైంది.సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12లోపు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రకటించాల్సి ఉండగా, గడువు కంటే ఒక రోజు ముందే స్పీకర్ తుది తీర్పును వెల్లడించారు.
దానం నాగేందర్ వ్యాఖ్యలు
తీర్పు అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. వ్యక్తిగత నిర్ణయంతోనే భారత జాతీయ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశానని తెలిపారు. తన మౌలిక హక్కులను ఎవరూ కాలరాయలేరని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని చెప్పారు.
అనర్హత పిటిషన్ల నేపథ్యం
ఖైరతాబాద్ నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.అలాగే స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.ఈ వ్యవహారంపై భారత సర్వోన్నత న్యాయస్థానం లో కూడా విచారణ కొనసాగుతోంది. రేపు కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో స్పీకర్ ముందుగానే తన తీర్పును వెల్లడించారు.
