మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): కొత్త పార్టీతో తమిళనాడులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ కు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యాయి. మహిళా దినోత్సవం సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, విడాకుల అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.పార్టీ మహిళా విభాగం నేత రంజనా నాచియార్ విజయ్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “సొంత భార్యకు గౌరవం ఇవ్వని వ్యక్తి ఇతర మహిళలను గౌరవిస్తారని ఎలా నమ్మాలి?” అని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా కలిసి జీవించి, ఇద్దరు పిల్లలకు తల్లైన భార్య గురించి నిర్లక్ష్యంగా మాట్లాడటం సరైంది కాదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కావాలని ఆశించే వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి వ్యాఖ్యలు యువతకు తప్పుడు సందేశం ఇస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే విడాకుల కేసు కొనసాగుతున్న సమయంలో నటి త్రిష కృష్ణన్ తో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరుకావడాన్ని కూడా ఆమె విమర్శించారు. రాజకీయాల కంటే కుటుంబానికి ఇచ్చే గౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన పార్టీ కార్యక్రమంలో విజయ్ స్పందించారు. తన వ్యక్తిగత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని, కార్యకర్తలు ఆ విషయాల గురించి ఆందోళన చెందవద్దని కోరారు. తన వ్యక్తిగత విషయాల వల్ల అభిమానులు ఒత్తిడికి గురవడం బాధగా ఉందని, అందరూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇటీవల విజయ్పై వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత విజయ్ విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తనకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 20న జరగనుంది. అదే రోజు విజయ్ కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి.ఈ వివాదం తమిళ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
