Breaking News

తిరుమల దర్శనానికి కొత్త రూల్స్.. టికెట్ టైమ్‌కే మాత్రమే అనుమతి

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాలు. దర్శన టికెట్‌పై ముద్రించిన సమయానికే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే కొత్త నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇక నుంచి సమయం తప్పనిసరి

టీటీడీ నిర్ణయం ప్రకారం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులను టికెట్‌లో పేర్కొన్న సమయానికే అనుమతిస్తారు. ముందుగా వచ్చినా క్యూలైన్లలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఈ నిబంధనను మార్చి 9 నుంచి అమలు చేస్తున్నారు. భక్తులు ముందుగానే వచ్చి ఇబ్బంది పడకుండా తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

రద్దీ నియంత్రణకే నిర్ణయం

ఇప్పటివరకు టికెట్‌పై ఉన్న సమయానికి ముందే వచ్చినా భక్తులను అనుమతించేవారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి క్యూలైన్లలోకి రావడం వల్ల రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు సమయ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

మే 1 నుంచి తిరుమల దర్శనంలో భారీ మార్పులు

ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు

రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ప్రతి నెలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లవచ్చు. టికెట్ బుకింగ్ సమయంలోనే దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

తిరుపతిలో ఉచిత టోకెన్లు

టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి మెట్ల వద్ద ఉచితంగా జారీ చేస్తున్నారు. భక్తులు ఈ టోకెన్లను తీసుకుని తమకు కేటాయించిన సమయంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, తిరుమల లో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

రద్దీపై ఏఐ పర్యవేక్షణ

భక్తుల రద్దీని అంచనా వేయడానికి టీటీడీ ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగిస్తోంది. తిరుమల క్యూలైన్లు, మాడవీధుల్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తుల సంఖ్యను పర్యవేక్షిస్తున్నారు. దీంతో రద్దీని సమర్థంగా నియంత్రించడం సులభమవుతోందని అధికారులు తెలిపారు.

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *