మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థినులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల పథకాన్ని తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.7 లక్షల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశముందని ప్రాథమిక అంచనా.
ఎవరికి లబ్ధి?
ఈ పథకం కింద
- ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు
- సామాజిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీలు
- గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీలు
- ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థినులు
ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం పని చేస్తోంది.
భారీ వ్యయం
ఈ పథకం అమలుకు సుమారు రూ.1,600 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. రానున్న రాష్ట్ర బడ్జెట్లో దీనికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశముంది. స్కూటీలను దశలవారీగా పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
మంచి బ్రాండెడ్ స్కూటీల ఎంపిక
మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా బేసిక్ మోడళ్ల ధరలు రూ.60 వేల నుంచి ప్రారంభమైనా, నాణ్యత మరియు భద్రత దృష్ట్యా రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ధర ఉన్న బ్రాండెడ్ స్కూటీలను ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. టెండర్ ప్రక్రియలో బ్యాటరీ వారంటీ, కనీసం మూడు సంవత్సరాల సర్వీసింగ్ వంటి నిబంధనలు కూడా ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
విద్యార్థినులకు ప్రయాణం సులభం
పెట్రోల్ ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల కొరత వల్ల చదువు మానేస్తున్న అమ్మాయిలకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఈ పథకం అమలైతే ఉన్నత విద్యలో మహిళల నమోదు పెరగడంతో పాటు విద్యార్థినుల డ్రాప్అవుట్ రేటు కూడా తగ్గే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
