మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి చామకూర మల్లా రెడ్డి ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అయితే ఈ పెళ్లి ఆయన కుటుంబ సభ్యులది కాదు.. స్వయంగా మల్లారెడ్డి తన భార్య కల్పనా మల్లా రెడ్డి తో మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. తమ 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్చి 19న జరగనున్న ఈ ప్రత్యేక వేడుకలకు ముందు ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సత్యనారాయణస్వామి వ్రతంతో వేడుకలకు శ్రీకారం చుట్టి, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ వేడుకలకు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ను కుటుంబ సమేతంగా ఆహ్వానించగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు కూడా కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు.మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సరదాగా “మల్పన” అనే హ్యాష్ట్యాగ్ పెట్టాలని కేటీఆర్ సూచించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు ప్రత్యేకంగా డాన్స్ ప్రదర్శన ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.మొత్తంగా ఐదు రోజులపాటు గ్రాండ్ సెలబ్రేషన్స్తో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని మల్లారెడ్డి అట్టహాసంగా జరుపుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
