అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, జలవనరులు, పరిశ్రమలు, మహిళా సంక్షేమం వంటి అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయాలు
- రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం.
- రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.
- 300 మంది హెడ్ కానిస్టేబుళ్ల పోస్టులను రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం.
- చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ దాదాపు 17 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు.
- 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం.
- మిషన్ శక్తి కింద పని చేసే మహిళల కోసం ‘సఖీ నివాస’ హాస్టళ్లు ఏర్పాటు.
- పోలవరం ప్రాజెక్ట్ పనులకు అదనపు నిధుల కేటాయింపు.
- ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్కు ఆమోదం.
మంత్రులకు సీఎం దిశానిర్దేశం
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రుల పనితీరుపై సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. గ్యాస్ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని గమనించాలని చెప్పారు.ఏప్రిల్ 2న ప్రతి శాఖ పనితీరుపై నివేదికలు సమర్పించాలని, లక్ష్యాల సాధన, ఫైళ్ల క్లియరెన్స్, కేంద్ర నిధుల వినియోగంపై సమీక్ష ఉంటుందని తెలిపారు.
‘జలధార’ కార్యక్రమం
ఏప్రిల్ 2 నుంచి 90 రోజులపాటు జలధార కార్యక్రమం చేపట్టి కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయాలని ఆదేశించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేసి చివరి ఎకరానికి కూడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్థానిక ఎన్నికలపై సూచనలు
రాబోయే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. మార్చి 16న అన్ని జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించాలని కూడా ఆదేశించారు.
