అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి రోజు భోజనం పరీక్ష తప్పనిసరి
పిల్లలకు వడ్డించే ముందు ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం రుచి, నాణ్యత పరీక్షించాలని మంత్రి ఆదేశించారు. భోజనం నాణ్యత బాగుందని నిర్ధారించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు.
త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ
పథకంలో సమూల మార్పులు తీసుకురావడానికి త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. దీనివల్ల అన్ని పాఠశాలల్లో ఒకే విధమైన నాణ్యతతో భోజనం అందించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షణ
ప్రతి వారం ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఒక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని మంత్రి సూచించారు.
లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు
విద్యార్థులు భోజనం గురించి తల్లిదండ్రులకు చెప్పిన సమస్యలను లీప్ యాప్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా లోటుపాట్లను త్వరగా సరిదిద్దుతామని చెప్పారు.
డొక్కా సీతమ్మ పేరుతో పథకం
అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరిట నడుస్తున్న ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రతిష్టాత్మకమని, ఇందులో నాణ్యత తగ్గినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రాంతంలో మధ్యాహ్న భోజనం అంశంపై వచ్చిన వివాదంపై కూడా అధికారులు దర్యాప్తు చేసి వివరాలు సమర్పించినట్లు మంత్రి తెలిపారు.
